Monday, April 15, 2013

మహి

http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3

చైత్రాగమనంతోనే మహి మొల కలెత్తుతుంది. చిగురుస్తుంది. మొగ్గ తొడుగుతుంది - పూలు పూస్తుంది. ఈ రాగబంధాన్ని రచయిత్రి కుప్పిలి పద్మ రమణీయంగా చిత్రించారు. ‘మహి’ నవల రూపంలో మన చేతికం దించారు. లోగడ ఒక వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకాదరణ పొందిన ఈ నవల, పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమైన మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జీవన మధురిమను రుచి చూపుతుంది. ఏలె లక్ష్మణ్ ముఖచిత్రం మనోహరంగా వుండి చదువరులను ఆకర్షిస్తుంది.

సరైన తోడు దొరకనప్పుడు ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే హాయిగా ఉంటుంది. మహి కూడా అలాగే జీవిస్తుంటుంది. అలజడితో చలించక అంతర్వాహినిలా నిశ్శబ్దంగా సాగిపోతుంది. సమస్తం సమదృష్టితో వీక్షిస్తూ, కుటుంబాన్ని వెలిగించాలని తాపత్రయ పడుతుంది. అయితే ఆమె ప్రయత్నానికి పర్యవసానాన్ని మార్చేశక్తి లేదు. వైదేహి, ప్రకాశరావు దంపతుల ఆరుగురి సంతానంలో ‘మహి’ చివరి అమ్మాయి. హైదరాబాద్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం. అక్కడే అక్క మాధవి కుటుంబమూ.

తల్లి తమ దగ్గరికి వస్తూ, పోతూ వుంటుంది. మాధవి ముద్దుల కూతురు నందన. వైదేహికి మరీ గారం. నందన రిచ్‌గా బతకాలని బోలెడు కలలు కంటుంది. బోర్‌లైఫ్ అస్సలు భరించలేదు. అమాంతం ఎగిరి ఆకాశాన్ని అందుకోవాలని ఆరాట పడుతుంది. అరిచి గీపెట్టి మరీ అడిగినవన్నీ సాధించుకుంటుంది. ‘‘పబ్‌కి వెళ్ళు. చక్కగా ఎంజాయ్ చెయ్. అయితే తాగొద్దు. నేను, డాడీ కలిసి తాగేటప్పుడు టేస్ట్ చేద్దువుగాని’’అని కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో తిరగడానికి అనుమతిస్తుంది తల్లి మాధవి. ఆ ఇంటి వాతావరణంలో ఇలాంటి ఇంపైన అవగాహన కనిపిస్తుంది.

అక్కడ విశాఖలో మహి పెద్దన్నయ్య రామచంద్రరావు, వదిన విజయది మరో కథ. మృదువైన మాటలతో పెద్ద కొడుకుని అదుపాజ్ఞలలో పెట్టుకున్న తల్లి వైదేహి, కోడలిని ఒంటరిని చేస్తుంది. బతుకుతీపి కరువై నిర్లిప్తంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ఆకస్మికంగా ఓ అందమైన స్నేహం ప్రవేశిస్తుంది. మహి సహాయంతో ఆ కొత్త స్నేహితుడు రవితో మొదలైన ప్రణయ విహారం, క్రమంగా శారీరక సంబంధంగా బలపడుతుంది. తమ ఇంటి పరువు కాపాడుకోవాలనే ఒకేఒక్క తపనతో విజయను కట్టడి చేయడానికి వైదేహీ ఎన్నో ఎత్తులు వేస్తుంది. ఆఖరుకు ఆ సంకెళ్ళు తెంచుకుని విజయ వెళ్ళిపోతుంది. ఆమె పిల్లలు మహి గూటికి చేరతారు.

మహి స్వేచ్ఛా వర్తన ఆమె కుటుంబ సభ్యులకు కంటగింపు కలిగిస్తుంది. అందుకని ఆమెతో అంత ఆత్మీయంగా మెలగరు. అయితే అవసరం వల్లనో, మరో కారణం చేతనో మాట్లాడక తప్పదు. అలాగని వీరి మధ్య ప్రేమాభిమానాలు లేవనీ చెప్పలేం. వారి ఈ అయిష్టతకు, మహి జీవితంలో కల్లోలానికి సాగర్, సిద్ధార్థ, చైతన్య కారణమౌతారు. ఒక్కొకరితో ఒక్కో రకమైన పరిచయం. ఆఖరుకు అభిప్రా యాలు, అభిరుచులు కలిసిన చైత్రతో జీవితం కొనసాగించుకోవాలని మహి నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఇంత విసుగు, కోపం, నిర్లక్ష్యం, నిందలు, చులకన, ఎగతాళి, చీదరింపులు, వంకర నవ్వులు, సూటీమాటలు, ఎత్తిపొడుపులు వినాల్సి రావడం నిజంగా బాధా కరం. ఆ వైనాన్ని చిత్రించడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.

మనల్ని వెంటాడి వేధించే వాక్యాలు ఈ నవల్లో అడుగడుగునా తారాజువ్వల్లా తారసపడతాయి. అయితే ఇందులో ఇతివృత్తం కొత్తదేమీ కాదు. ఓ కుటుంబం, అందులో సరాగాలూ-విరాగాలూ, అంతే! కాకపోతే విభిన్న వ్యక్తిత్వాల్లోని నిగూఢతను లోతుగా స్పర్శించడం వల్ల వాస్తవిక చిత్రణగా స్ఫురిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల ఆలోచనా ధోరణులకు తార్కికత జోడించి చెప్పడం వలన రచన మెరుపు సంతరించుకుంది. అలాగే భిన్న జీవనశెలులను ప్రజెంట్ చేయడంలో రచయిత్రి నేర్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘మహి’లో నేర్పు, కూర్పు కనిపించినంతగా సృజన కానరాక పోవడం ఓ చేదునిజం!
- కోటేశ్వరరావు
(‘మహి’ - కుప్పిలి పద్మ, పేజీలు: 297,
వెల: రూ. 120, ప్రతులకు: 201, విజయలక్ష్మి అపార్ట్‌మెంట్స్, మెథడిస్ట్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్-16)
- See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3#sthash.wT48WMIs.dpuf

అందే నారాయణస్వామి


This article is sponsored by

‘చీకటి తెరలు’ చించినవాడు!





మంచి రచయితలంతా జీవనంలోని వాస్తవికతను చూస్తారు. అవాస్తవికత అంటే నిర్దయగా ఉంటారు. దాదాపు వంద కథలు రాసిన అందే నారాయణస్వామి కూడా అలాంటి కథకుడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నారాయణస్వామి వృత్తికి నేతగాడు. దిగువ మధ్య తరగతి, కాస్త పెకైదిగిన తరగతి కుటుంబ జీవనం ఆయన కథలకు ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. చిన్న గుమాస్తాలు, అమాయక గృహిణులు, ఉపాధ్యాయులు ఆ కథలలో కనిపిస్తారు. ఈ తరగతి, అందులోని వారి జీవిత వాస్తవాలు ఏవీ నారాయణస్వామి చూపు దాటిపోలేదు. వారి కన్నీళ్లు, వెతలు, అప్పులు అన్నీ ఆయనకు కథా వస్తువులే. ఒక దశ తర్వాత అకాల అంధత్వం కూడా ఆయన సాహిత్యసేవకు అడ్డంకి కాలేకపోయింది.

నారాయణస్వామి మొదట పద్య కవిత్వం వైపు మొగ్గినవారే. కానీ మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి , ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్లతో ఏర్పడిన స్నేహం కథ వైపు నడిపించింది. మంగళగిరి చేనేతకు వన్నెకెక్కింది. చాలా వ్యవస్థల వలెనే చేనేత కూడా ప్రపంచీకరణ దుష్ర్పభావానికి గురయినదే. వారి జీవితాలను ఛిద్రం చేసినదే. ఈ పరిణామాలను కూడా నారాయణస్వామి తన కథలకు ఇతివృత్తంగా తీసుకున్నారు.

ధనికులూ, రుణగ్రస్థుల బంధం ఎలాంటిదో ‘ప్రతిఫలం’ అన్న కథలో అందే చిత్రించారు. రుణగ్రస్థులు తమ ఆస్తులు, ఇళ్లు ఎలా కోల్పోతారో ఇందులో వర్ణించారాయన. ‘పుత్ర సంతానం’ మన కుటుంబాలలోని ఇంకొక కోణాన్ని చూపుతుంది. డబ్బులో పుట్టి, అందులోనే పెరిగిన పిల్లలు ఆఖరికి రక్త సంబంధీకుల పట్ల కూడా ఎలా ఉండగలరో, వారసత్వ విషయంలో, స్త్రీపురుష సంబంధాల దగ్గర వారు ఎలా వ్యవ హరిస్తారో ఈ కథలోనే చెప్పారు.

ఏ రచయిత అయినా తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని రచనలలో చిత్రించకుండా ఉండలేడు. నారాయణస్వామి మంగళగిరి పానకాలస్వామి గురించి, ఆ పరిసరాలను గురించి కథల్లో తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే గుంటూరు ప్రాంతంలో వినిపించే మాండలికాలు కూడా. ‘పరివర్తనం’ అన్న కథలో దళిత సమస్యను చర్చించారు నారాయణస్వామి. ‘మాలపల్లి’ నవలాకర్త ఉన్నవ సాహచర్యం, ప్రభావం ఈ కథా రచనలో సుస్పష్టం. ఆధునికత మీద అభిమానం ఉన్నా, అది వెర్రిపోకడలకు పోరాదని చెప్పే కథ ‘సంఘ సంస్కరణ’.

అందే రాసిన విశిష్టమైన కథ ‘ఉపాసనాబలం’. పెద్దగా చదువు లేకపోయినా చక్కని మాటకారితనంతో ప్రజలందరినీ కట్టడి చేసే వ్యక్తి జయరామయ్య. ఇందులో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తాడు. ఈ కథను నడిపించే క్రమంలోనే రచయిత పల్లెల్లో ఉండే అనేక ప్రత్యేకతలను గురించి వివరిస్తాడు. అనేక సంఘటనల సమాహారం ఈ కథ. 1956 ప్రాంతంలోనే తన ప్రతాపం చూపించిన యంత్రీకరణతో చేనేత పనివారి బతుకుల్లో అలుముకున్న చీకటిని చిత్రించిన కథ ‘శిల్పి’. నేతగాడు బతికేందుకు వీథి చివర మధూకర వృత్తిని ఎంచుకోవడం ఇందులో ఇతివృత్తం. అలాగే ‘కొడుకులు’ కథ రైతు జీవితంలోని చేదును వర్ణిస్తుంది. కొడుకులను నమ్ముకోవడం

కంటె నేలతల్లిని నమ్ముకోవడమే మేలని ఈ కథలో రచయిత చెబుతాడు.
నారాయణస్వామి నాలుగు కథా సంపుటాలను వెలువరించారు. రెండు నవలలు కూడా రాశారు. జీవితంలోని వాస్తవికతతో పాటు, దాని మీద మనిషికి ఉండే మమకారం గురించి సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి అందే కథలు ఉపకరిస్తాయి. విశాలాంధ్ర సంస్థ 2008లో ఈ రచయిత 16 కథలను ‘చీకటితెరలు’ పేరుతో వెలువరించింది. ఇది మార్కెట్‌లో దొరుకుతుంది- కొని, చదవండి!
- వేలూరి కౌండిన్య
- See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=34878&Categoryid=1&subcatid=3#sthash.wOrcIXcv.dpuf